Categories
Journalism

అక్షరాలే సాక్ష్యాలుగా మార్క్స్‌ ఏంగెల్స్‌ జీవితాలు

కారల్‌ మార్క్స్‌ ఏంగెల్స్‌లు మొదటిసారి నవంబరు 1842లో కొలోన్‌లో కలిశారు. వారిద్దరి మధ్య సైద్ధాంతిక సహవాసం మాత్రం 1844 నుండే మొదలైంది. 1849లో యూరోపియన్‌ విప్లవ వెల్లువ వెనకపట్టు పట్టడంతో మార్క్స్‌ ఇంగ్లాండ్‌కు వలస పోవాల్సి వచ్చింది. ఏంగెల్స్‌ కూడా మార్క్స్‌తో పాటే ఇంగ్లాండ్‌ చేరారు. మార్క్స్‌ లాడ్జింగ్‌లలో తలదాచుకుంటే ఏంగెల్స్‌ అక్కడికి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మాంచెస్టర్‌లో కుటుంబ యాజమాన్యంలో ఉన్న నూలుమిల్లు నడిపే బాధ్యతలు తీసుకున్నారు. 1850 నుండి 1870 వరకూ నూలు మిల్లు బాధ్యతల్లో ఉన్నప్పటికీ ఏంగెల్స్‌ మార్క్స్‌ల మధ్య సైద్ధాంతిక బంధం గాఢంగా పెనవేసుకుపోయింది. ఇద్దరూ ఏ చిన్న అంశంపై రాసినా పరస్పరం పంచుకుని సరి చూసుకునేవాళ్లు. నాటి ప్రపంచ పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలో లోతుగా చర్చించుకునే వాళ్లు. ఇలాంటి చర్చల కోసం వారిరువరూ రాసుకున్న లేఖలు వేల సంఖ్యలో ఉన్నాయంటే ఇద్దరి మధ్య జరిగిన సైద్ధాంతిక సంభాషణ ఏ స్థాయిలో, ఏ తీవ్రతతో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఆ రెండు దశాబ్దాల కాలంలో ఇద్దరి మధ్యా రెండున్నర వేల లేఖలు నడిచాయి. మరో 1500 లేఖలు సమకాలీన విప్లవకారులు, సోషలిస్టులు, కార్మిక నాయకులు, మొదటి ఇంటర్నేషనల్‌ సభ్యులకు రాసిన లేఖలు ఉన్నాయి. వీటికి తోడు మార్క్స్‌ ఏంగెల్స్‌ అందుకున్న మరో 10,000 లేఖలు ఉండనే ఉన్నాయి. అదనంగా మరో ఆరువేల లేఖలు లెక్క తేలుతున్నప్పటికీ అవి ఎక్కడ ఏ స్థితిలో ఉన్నాయో తెలియరాలేదు. ఈ లేఖలు అద్భుతమైన చరిత్రకు ఆరంభాలు. ఆయా లేఖల్లో చర్చకు పెట్టిన అనేక సైద్ధాంతిక అంశాలను మార్క్స్‌ ఏంగెల్స్‌లు తర్వాతి కాలంలో పరిపూర్ణంగా అభివృద్ధి చేసి ఉండలేకపోవచ్చు. కానీ అందులో ఉన్న వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ప్రపంచానికి ఉంది. ఇద్దరు కమ్యూనిస్టు యోధుల కలాల నుండి జాలువారిన 19వ శతాబ్ది సాహిత్య ప్రస్తావనలు పరిశీలిస్తే ఇద్దరికీ ఆర్థిక రాజకీయ అంశాలతో పాటు సామాజిక సాంస్కృతిక, చారిత్రక అంశాలపై కూడా ఎంతటి పట్టు ఉందో అర్థమవుతుంది.
మార్క్స్‌ ఎనిమిది భాషల్లో ప్రావీణ్యం సంపాదిస్తే ఏంగెల్స్‌కు 12 భాషల్లో పట్టు ఉండేది. ప్రాచీనమైన లాటిన్‌ గ్రీకు భాషల్లో కూడా మార్క్స్‌ ఏంగెల్స్‌లు లేఖలు రాశారంటే వాళ్లకున్న సామర్ధ్యం తేటతెల్లమవుతుంది. మానవాళి ఉద్ధరణకు కంకంణం కట్టుకున్న ఇద్దరూ సాహిత్య ప్రఖండులే. ప్రవీణులే. షేక్స్‌పియర్‌ నాటకాలు మార్క్స్‌కు కంఠతా వచ్చు. ఎఖిలస్‌, డాంటే, బాల్జాక్‌ రచనలు పిలిస్తే పలికేవి. మాంచస్టర్‌ కేంద్రంగా పని చేసే షిల్లర్‌ ఇనిస్టిట్యూట్‌కు ఏంగెల్స్‌ దీర్ఘకాలం అధ్యక్షుడుగా ఉన్నాడు. అరిస్టాటిల్‌, గోధె, లీసింగ్‌ల రచనలు నాలికమీద ఉండేవి. విశ్వ విప్లవం సాధ్యాసాధ్యాల గురించిన చర్చతో పాటు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు, ఉత్తర ప్రత్యుత్తరాల్లో సమకాలీన శాస్త్ర పరిజ్ఞానం, సాంకేతిక అభివృద్ధి, భూగోళ శాస్త్రం, భౌకతి రసాయన శాస్త్రాల్లో ఆవిష్కృతమవుతున్న పురోగతి, గణితం, మానవ పరిణామ శాస్త్రం గురించిన వివరాలెన్నో వీనులవిందు చేస్తాయి. ఏ విషయం కోసమైనా మార్క్స్‌ ఆధారపడగల ఏకైక వ్యక్తిగా ఏంగెల్స్‌ నిలిచాడు. మార్క్స్‌ ఏ సందర్భంలో ఏ రకమైన సమస్య, ప్రశ్న, మీమాసం ఎదుర్కొన్నా ఆయన పలకరించే మొదటి వ్యక్తి ఏంగెల్స్‌.
వారిద్దరి మధ్య ఉన్నది కేవలం మేధో సంబంధం మాత్రమే కాదు. అద్వితీయమైన మానవ సంబంధం. స్నేహ బంధం. ఏంగెల్స్‌తో చెప్పుకోని సమస్యంటూ మార్క్స్‌కు లేదు. కుటుంబ ఆర్థిక అవసరాల విషయంలో ఎదురవుతున్న విషమ పరిస్థితులు మొదలు కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు, రాగద్వేషాలు అన్నింటినీ ఏంగెల్స్‌తో చర్చించేవాడు మార్క్స్‌. మార్క్స్‌ అవసరాలు తీర్చటానికి ఏంగెల్స్‌ తనను తాను మర్చిపోయి మరీ ప్రయత్నం చేశాడు. ఏ కొద్దిపాటి సాయం అందించగలిగినా వెనకంజ వేయలేదు. ఈ విధంగా మార్క్స్‌కు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన పెట్టుబడి గ్రంథాన్ని పూర్తి చేయటానికి తెరవెనక నుండి ఏంగెల్స్‌ అందించిన సహాయం వెలకట్టలేనిది. మర్చిపోలేనిది. 1867 ఆగస్టులో పెట్టుబడి గ్రంథం తొలి సంపుటాన్ని పూర్తి చేసిన ఓ రాత్రి ఏంగెల్స్‌ను గుర్తు చేసుకుంటూ ”నీకు అన్ని రకాలుగా కృతజ్ఞుడిని. నీవు లేకపోతే పెట్టు బడి గ్రంథం పూర్తయ్యేదే కాదు” అని రాశారు.
మొదటి కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ దైనందిన వ్యవహారాల్లో 1864 నుంచీ మార్క్స్‌ దిగబడిపోవటం వలన ఈ గ్రంథం మరింత ఆలస్యమైంది. కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ ఏర్పాటు, నిర్మాణం, నిర్వహణలో కీలక నాయకత్వ భారం మార్క్స్‌దే అయినా ఏంగెల్స్‌ కూడా తనకున్న అన్ని శక్తి సామర్ధ్యాలు, నైపుణ్యాలు దీనికోసం వెచ్చించారు. మార్చి 18, 1871 రాత్రి తాము ఊహించిన ఆశాసౌధం పారిస్‌ కమ్యూన్‌ రూపంలో ఆవిష్కృతమైందని, సోషలిస్టు సమాజ నిర్మాణం దిశగా తొలి అడుగులు పడ్డాయన్న వార్త విన్నప్పుడు తాము ఊహించినదానికంటే సమాజం వేగంగానే మారుతోందని గుర్తించారు.
జెన్నీ 1881లో మరణించిన తర్వాత మరింత దిగజారిపోయిన మార్క్స్‌ ఆరోగ్యాన్ని కుదుటపర్చటానికి లండన్‌కు దూరంగా బస చేయించాలని డాక్టర్లు సలహా ఇచ్చినప్పుడు కూడా మార్క్స్‌ ఏంగెల్స్‌ల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు ఎన్నడూ ఆగలేదు. రకరకాల సందర్బాల్లో ఇద్దరినీ రకరకాల పేర్లతో ప్రవాస కార్మికవర్గ నాయకులు పిలుస్తూ ఉండేవారు. సైనిక శాస్త్రంలో ఏంగెల్స్‌కున్న ప్రావీణ్యం రీత్యా ఆయన్ను జనరల్‌ అని, మార్క్స్‌ గడ్డం, జుట్టు, ఇంగ్లీషు వేషధారణ రీత్యా ఆయన్ను మూర్‌ అని మొదటి ఇంటర్నేషనల్‌ కార్యవర్గ సభ్యులు పిలుచుకునేవారు. మార్క్స్‌ కొద్దిరోజుల్లో చనిపోతాడనా కూతురు ఎలెనార్‌ను పిలిచి ‘ఆ అసంపూర్ణంగా మిగిలిన రాతప్రతులను ఏదో ఒకటి చేయమని చెప్పు ఏంగెల్స్‌కు ” అంటారు
మార్క్స్‌. 1883 మార్చిలో ఓ మద్యాహ్నవేళ మార్క్స్‌ను కలిసిన ఏంగెల్స్‌ మార్క్స్‌ ఆఖరి కోరికకు విలువనిచ్చి అసంపూర్ణంగా మిగిలిన పెట్టుబడి రెండు, మూడు సంపుటాలను సంస్కరించి ప్రచురించే యజ్ఞాన్ని చేపట్టారు. అదే మార్క్స్‌ను ఏంగెల్స్‌ ఆఖరిసారి ప్రత్యక్షంగా కలుసుకోవటం. మార్క్స్‌ మరణించిన తర్వాత ఏంగెల్స్‌ మరో పుష్కరకాలం జీవించి ఉన్నారు. ఈ కాలంలో ప్రధాన సమయాన్ని పెట్టుబడి గ్రంథం పూర్తి చేసి అచ్చుకు సిద్ధం చేయటానికే వెచ్చించారు ఏంగెల్స్‌.
తన జీవితం చివరి దశాబ్దంలో మార్క్స్‌తో కలిసి చేయాల్సిన ఉత్తర ప్రత్యుత్తరాలతో సహా అనేక పనులను చేయలేకపోయానని ఏంగెల్స్‌ బాధపడ్డారు. మార్క్స్‌ మరణానంతరం ఇద్దరి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను ఓ వరుస క్రమంలో అమరుస్తున్న ఏంగెల్స్‌ నోట్లో సిగరెట్‌ పైపుతో అర్థరాత్రి దాటిన తర్వాత మేజా బల్ల మీద లేఖలు రాస్తూ కూర్చున్న మార్క్స్‌ను గుర్తు చేసుకుంటారు. ఈ లేఖలను భద్రపర్చే క్రమంలో తరచూ ఏంగెల్స్‌ మార్క్స్‌తో ముచ్చటించిన విషయాలు, చిరాకుపడ్డ సందర్భాలు, మనాసారా నవ్వుకున్న చర్చలు, చేజారిన విప్లవ అవకాశాలను మదింపు వేస్తూ రేపటి విప్లవం ఎప్పుడు ఎక్కడ అంటూ సాగించిన మేధోమధనాలతో ఏంగెల్స్‌ జ్ఞాపకాల పొరలు రెక్కలు విచ్చుకుంటున్న పక్షుల్లా కిలకిలా రావాలు చేసేవి. ఎంత భావోద్వేగానికి లోనైనా నిద్రాణంగా ఉన్న కోట్లాదిమంది శ్రమ జీవులు దిక్కులు పిక్కటిల్లేలా రంకెలు వేస్తూ పెట్టుబడిదారీ వ్యవస్థ సౌధాన్ని కుప్పకూల్చను న్నారన్న విషయంలో ఏ నాడూ విశ్వాసాన్ని కోల్పోలేదు.

Categories
Reviews

Veeraiah Konduri, Telugadda

Karal Marx: మార్సెల్లో ముస్టో రచించచిన కారల్‌ మార్క్స్‌ చివరి సంవత్సరాలు : మేధో జీవిత చరిత్ర గ్రంధం ప్రధానంగా ఇప్పటి వరకూ పరిశోధనకు, పరిశీలనకు అందుబాటులోకి రాని సమాచారాన్ని విశ్లేషించే రచన. ఈ రచన మార్క్స్‌ మేధో జీవితం, వ్యక్తిగత జీవితాలను లోతుగా పరిశీలిస్తోంది. దీనికి గాను ఉపయోగించిన సమాచారం ప్రధానంగా 1998లో మార్క్స్‌ సర్వ సమగ్ర రచనల ప్రాజెక్టు పేరుతో సాగుతున్న పరిశోధనల నుండి సేకరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఇప్పటికి 114 సంపుటాలు అందుబాటులోకి వచ్చాయి.

మార్క్స్‌ జీవితంలో చివరి దశ కష్టాలు కడగండ్లతో నిండి ఉంటుంది. ఈ కాలంలోనే మార్క్స్‌ కూతురు ఎలినార్‌ తీవ్రమైన మనోవ్యాధికి లోనవుతుంది. (1898లో ఆత్మహత్య చేసుకుంటుంది). అత్యంత ప్రియ సఖి, జీవిత సహచరి జెన్నీ కాలం చేస్తుంది. జెన్నీ ముఖం తలచుకున్నప్పుడల్లా మధురమైన జ్ఞాపకాలు వరదలై కళ్లు చమరుస్తాయని మార్క్స్‌ ఓ సందర్భంలో చెప్పుకున్నారు. తొలి సంతానం జెన్నీ కరోలిన్‌ కూడా ఈ కాలంలోనే చనిపోతుంది. ఈ సమయంలో బయటపడిన ఊపిరితిత్తుల వ్యాధి జీవితాంతం ఆయన్ను వెంటాడుతూ వచ్చింది. అనేక రూపాల్లో ఆయన పని ముందుకు సాగకుండా ఆటంకపర్చింది. ఈ స్థాయిలో సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ఏ వ్యక్తికైనా తాను నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తి చేయటయం అసాధ్యం. మార్క్స్‌ కూడా ఓ వైపు అప్పుడే అంకుర దశలో ఉన్న అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమానికి దిశా నిర్దేశం చేస్తూ మరోవైపు కుటుంబ సమస్యలతో సతమతమౌవటంతో తాను నిర్దేశించుకున్న అనేక మేధో లక్ష్యాలను పూర్తి చేయటంలో విఫలమయ్యారు. తన అధ్యయనాలన్నింటికీ తలమానికంగా ఉన్న పెట్టుబడి గ్రంధం రెండో సంపుటి, మూడో సంపుటిని కూడా అచ్చుకు సిద్ధం చేయలేకపోయారు.

ప్రపంచ కమ్యూనిస్టు విప్లవ వ్యూహరచయితగా కొనియాడబడుతున్న కారల్‌ మార్క్స్‌కు అత్యంత ఆహ్లాదకరమైన సమయం ఏమిటో తెలుసుకుంటే ఒకింత ఆశ్చర్యం కలగకమానదు. తాను మనమళ్లు, మనుమరాండ్రుతో గడిపిన కొన్ని క్షణాలు, జర్మన్‌ సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్ధులు కొత్తగా ఏర్పడ్డ పార్లమెంట్‌కు పోటీ చేస్తే మూడువందలకు పైగా ఓట్లు సాధించటం వంటి సందర్భాలు ఆయన మనసును తేలికపరిచి తిరిగి ఉత్సాహపరిచేవి. జీవితం చివరి నాళ్లలో మార్క్స్‌కు గణితశాస్త్రం పట్ల కలిగిన ఆసక్తి, దానికోసం ఆయన వెచ్చించిన సమయం పరిశీలకులను ఆశ్చర్యపరుస్తుంది. పాల్‌ లాఫార్గ్‌ మాటల్లో ‘‘ఆయన ప్రాణానికి ప్రాణంతో సమానమైన జెన్నీ అనారోగ్యంతో మంచానపడ్డప్పుడు కలిగిన దు:ఖం నుండి మార్క్స్‌నను బయటపడేసిన ఏకైక అంశం గణితశాస్త్ర అధ్యయనం.’’ నేడు గ్రండ్రిస్‌గా పిలవబడుతున్న ఏడు నోట్సులు రాసుకునే సమయంలో మార్క్స్‌ గుర్తించిన కొన్ని లోపాలను సరిచేసుకోవటానికి ఆల్జీబ్రా అధ్యయనంతో మొదలైన గణితం పట్ల ఆసక్తి ఆయనకు అత్యంత క్లిష్టకాలంలో మనసులను తేలికపర్చిన వ్యాపకంగా మారింది.

పేవలమైన ఆరోగ్యంతో కుస్తీపడుతూనే మార్క్స్‌ అమెరికా, భారత దేశం, రష్యా, యూరప్‌లో సాగుతున్న రాజకీయ పోరాటాల మొదలు ఆర్థికరంగం, ఆల్జీబ్రా, కలనగణితం, మానవపరిణామ శాస్త్రం, చరిత్ర, భూగర్భశాస్త్రం, వ్యవసాయక రసాయన శాస్త్రం, ఖనిజశాస్త్రం వంటి అనేక అంశాలపై సాధికారిక అంచనాకు రావడానికి ఉపకరించే నోట్సులు తయారు చేసుకున్నారు. లోతైన పరిశోధనలు సాగించారు. సాధారణంగా మార్క్స్‌ అధ్యయనాలు యూరప్‌కు, ఆర్థిక వ్యవస్థకు, వర్గపోరాటాలకు, ఆర్థిక నియతివాదానికి పరిమితమయ్యాడని, వలసవాద పక్షపాతిగా ఉన్నాడని కొందరు మేధావులు మార్క్స్‌ ను కించపరిచేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ముస్టో రచన మార్క్స్‌ పరిశోధనా ప్రపంచం నిజమైన ప్రపంచమంత విస్తృతి కలిగిదనీ, ఆయన్ను వర్గ పోరాటానికో, ఆర్థిక నియతివాదానికో, యూరప్‌కో పరిమితం చేయటం ఆయన్ను అపార్థం చేసుకోవటమేనని ధృవీకరిస్తుంది.

1972లో లారెన్స్‌ క్రేడర్‌ ఎథ్నొలాజికల్‌ నోట్‌బుక్స్‌ ఆఫ్‌ కారల్‌ మార్క్స్‌ అనే ప్రసిద్ధ గ్రంధాన్ని మార్క్సిస్టు అధ్యయనకారుల ముందుకు తెచ్చారు. ఈ రచనలో మౌలికంగా మోర్గాన్‌ పురాతన సమాజం, హెన్రీ సమ్మర్‌ మెయిన్‌ రచించిన ఎర్లీ హిస్టరీ ఆఫ్‌ ఇనిస్టిట్యూషన్స్‌, జాన్‌ లుబ్బాక్‌ రచించిన ఆరిజిన్స్‌ ఆఫ్‌ సివిలైజేషన్‌, జెపి పియర్స్‌ రాసిన ఆర్యన్‌ విలేజ్‌ వంటి గ్రంధాల నుండి విస్తారంగా సేకరించిన నోట్సును విశ్లేషిస్తారు క్రేడర్‌. ఇందులో మోర్గాన్‌ పురాతన సమాజం అత్యంత ప్రాధాన్యత కలిగిన రచన. మోర్గాన్‌ రచన చదివిన తర్వాతనే కుటుంబం గురించిన మార్క్స్‌ అవగాహన మారిందని ముస్టో వివరిస్తారు. రాజ్యం ఆవరతరణ, సమాజాన్ని అదుపులో ఉంచటంలో దాని పాత్ర గురించి 1843 నుండీ మార్క్స్‌ తాజాపర్చుకుంటూ వచ్చిన అభిప్రయాలను కూడా మోర్గాన్‌ రచన ధృవీకరిస్తుందని ముస్టో ప్రస్తావిస్తారు. మోర్గాన్‌ రాసిన పురాతన సమాజంతో పాటు సమకాలీన మానవజాతి పరిణామ శాస్త్రవేత్తల రచనలను అధ్యయనం చేయటంతో పాటు మోర్గాన్‌ గురించి మార్క్స్‌ రాసుకున్న నోట్స్‌లో కొంత భాగాన్ని సేకరించి ఏంగెల్స్‌ తర్వాతి కాలంలో కుటుంబం, వ్యక్తిగత ఆస్తి, రాజ్యాంగాల పుట్టుక అన్న ప్రామాణిక మార్క్సిస్టు రచనను మనముందుంచారు. ఈ గ్రంధం చారిత్రక భౌతికవాద సిద్ధాంతాన్ని సమాజానికి, సమాజ పరిణామ చరిత్రకు అన్వయించి మార్క్స్‌ నిర్ధారణల వాస్తవికతను చరిత్ర ధృవీకరించిందని రుజువు చేస్తుంది.
ఇప్పటి వరకూ అందుబాటులోకి వచ్చిన మార్క్స్‌ రచనల్లో సరైన ప్రాధాన్యతకు నోచుకోని రచన మాక్సిమ్‌ కొవెలవెస్కీ రచించిన ఉమ్మడి భూయాజమాన్యం అన్న రచనపై మార్స్‌ పరిశీలనలు. దశాబ్దం క్రితం వరకూ నెదర్లాండ్స్‌లోని ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ హిస్టరీ గ్రంధాలయానికి ప్రత్యక్షంగా వెళ్లి అక్కడి అల్మారాల్లో నిక్షిప్తం చేసిన పత్రాలను చదవగలిగిన వారికి మాత్రమే ఈ విషయాలు తెలిసే అవకాశం ఉండటంతో వీటి గురించిన సమాచారం బయటి ప్రపంచానికి అంతగా తెలియరాలేదు. ఈ విషయాలను తొలిసారిగా ప్రపంచం దృష్టికి తెచ్చిన రచన స్పానిష్‌ రచన ప్రాచీన సమాజం గురించి కారల్‌ మార్క్స్‌ రచనలు అన్న శీర్షికతో వచ్చిన రచన. ఈ రచనలోనే కొవెలవెస్కీ రచన గురించి మార్క్స్‌ సేకరించిన సమచారాన్ని తొలిసారిగా వెలుగులోకి తెచ్చారు ఈ నోట్స్‌లో కొలంబస్‌ అమెరికాను కనుగొన ముందున్న స్తానిక నాగరికతలు, ప్రాచీన భారతీయ నాగరికతలను మార్క్స్‌ ప్రశంసిస్తూనే కొవెలవెస్కీ వర్గీకరణను ప్రశ్నిస్తారు మార్క్స్‌. రెండు వేర్వేరు నాగరికత పరిణామాలను ఒకటిగానే భావించారని కొవెలవెస్కీని మార్క్స్‌ విమర్శిస్తారు. పూర్తిగా వేర్వేఉ చారిత్రక సందర్భాలు, భౌగోళిక పరిస్థితులు, నేపథ్యాల్లో ఉనికిలోకి వచ్చిన వ్యవస్థలు, సంస్థలను ఒకేమాదిరిగా సమానార్ధకాలుగా పరిగణించటం పట్ల మార్క్స్‌ అభ్యంతరం తెలుపుతారని ముస్టో ఈ గ్రంధంలో గుర్తు చేస్తారు.

మార్క్స్‌ రచల్లో లూయీ బోనపార్టీ, గోథా కార్యక్రమ విమర్శ, ఫ్రాన్స్‌ లో వర్గ పోరాటాలు మౌలికంగా రాజకీయ వ్యాఖ్యానాలుగా పరిగణిస్తుంటాము. ఈ మూడు రచనలు కూడా చదవకుండా మార్క్సిస్టు రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్న వారు కూడా లేకపోలేదు. ముస్టో తన తాజా రచన ద్వారా మార్క్స్‌ రాజకీయ వ్యాఖ్యానాలు ఈ మూడిరటికే పరిమితం కాదని గుర్తు చేస్తారు. జర్మనీ, ఫ్రాన్స్‌, రష్యాల్లోని రాజకీయ ఉద్యమాలలో మార్క్స్‌ పాత్రను, ప్రభావాన్ని అంచనా వేసేందుకు ప్రయత్నిస్తారు ముస్టో. 1880లో ఫ్రాన్స్‌కు చెందిన సోషలిస్టు వర్కర్స్‌ పార్టీ ఎన్నికల కార్యక్రమాన్ని రూపొందించటంలో మార్క్స్‌ పాత్ర గురించి ముస్టో తన రచనలో విశేషంగా ప్రస్తావిస్తారు. ఈ కార్య్కకమాన్ని రూపొందింటంలో భాగంగా ఫ్రాన్స్‌లోని కార్మికుల స్థితిగతులను, వేతనాలు, భత్యాలు, ఆర్థిక సామాజిక స్థితిగతులు గురించి అధ్యయనం చేయటానికి మార్క్స్‌ స్వయంగా 101 ప్రశ్నలు రూపొందించారన్న చారిత్రకవాస్తవాన్ని ముస్టో రచన ద్వారా తెలుసుకోవచ్చు. ఈ కోవకు చెందినదే అమెరికాకు ఆర్థికవేత్త హెన్రీ జార్జి మీద మార్క్స్‌ సంధించిన విమర్శ. కాలిఫోర్నియా వర్కర్స్‌ పార్టీకి గురించి, భారతదేశంలో వలసపానల పర్యవసానాల గురించి, ఐర్లాండ్‌ స్వాతంత్య్ర పోరాటం గురించి మార్క్స్‌ ప్రసంగాలు, రచనలు, వ్యాఖ్యానాలు అధ్యయనం చేస్తేనే మార్క్స్‌ సంపూర్ణ రాజకీయ దృక్ఫధం అర్థం చేసుకోవటం సాధ్యమవుతుందని ముస్టో స్పష్టం చేస్తున్నారు. వీటన్నింటిని అధ్యయనం చేసేటప్పుడు ఆయా పోరాటాలకు నేపథ్యంగా ఉన్న నిర్దిష్ట పరిస్థితుల గురించి కూడా మార్క్స్‌ నిర్దిష్ట పరిశీలనకు ఓపిగ్గా ప్రయత్నం చేసారే తప్ప ఒకటో అరో పరిశీలించి వాటి ఆధారంగా సార్వత్రిక నిర్ధారణలకు రాలేదన్నది ముస్టో మనకు ఈ రచన ద్వారా గుర్తు చేస్తున్న ముఖ్యమైన అంశం. మార్క్స్‌ ఈ అధ్యయన పద్ధతినే తర్వాతి కాలంలో లెనిన్‌ నిర్దిష్ట పరిస్థితుల నిర్ధిష్ట అధ్యయనం అని పిలిచిన విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు.

జారిస్టు రష్యాలో జరుగుతున్న మార్పులను స్వయంగా అర్థం చేసుకోవటానికి రష్యన్‌ రచనలు చదవటానికి వీలుగా 1869లో రష్యా భాష నేర్చుకోవటానికి మార్క్స్‌ ఉపక్రమించటాన్ని ముస్టో ప్రస్తావిస్తారు. 1870 దశకమంతా మార్క్స్‌ రష్యా వ్యవసాయక స్థితిగతులను అధ్యయనం చేయటానికి వెచ్చిస్తారు. 1876లో డ్యూరింగ్‌ రచనకు సమాధానం రాయాలని మార్క్స్‌ ఏంగెల్స్‌ను ప్రోత్సహిస్తారు. దీనికి సమాధానంగా ఏంగెల్స్‌ నవ్వుతూ ‘‘ నువ్వు మాత్రం వెచ్చటి కంబళి కప్పుకుని విరామం లేకుండా రష్యాలో వ్యవసాయక స్థితిగుతుల గురించి ప్రత్యేకంగా కౌలు గురించి చదువుతూ నన్నేమో నా చేతిలో ఉన్న పనులన్నీ పక్కన పెట్టి ఓ చెక్క కుర్చీలో కూర్చుకుని వెచ్చదనం కోసం వైన్‌ తాగుతూ డ్యూరింగ్‌ తలకాయ నుజ్జు నుజ్జు చేయటానికి పూనుకొమ్మని పురమాయిస్తావా’’ అంటారు. తామిద్దరూ పంచుకున్న సైద్ధాంతిక కృషి కర్తవ్యాల గురించి ఈ సంభాషణ గమనిస్తే ఆశ్చర్యం కలగక మానదు. రష్యాకు చెందిన నికొలాయ్‌ చెరెన్క్సీని మార్క్స్‌ ఎంతో ప్రామాణికంగా పరిగణిస్తారు. పందొమ్మిదో శతాబ్దం చివర్లో చెరెన్క్సీ సమకాలీన రష్యా సామాజిక జీవన వాస్తవికతను ప్రతిబింబిస్తూ ఏమి చేయాలి అన్న సాంఘిక నవల రాస్తారు. ఈ శీర్షికనే తర్వాతి కాలంలో పార్టీ నిర్మాణం ప్రాధాన్యత గురించి రాసిన తన గ్రంధానికి లెనిన్‌ శీర్షికగా ఎంచుకుంటారు. యూరప్‌లో చెరెన్క్సీని, ఆయన రచనలను, కృషి పరిచయటం చేయటానికి వీలుగా ఆయన గురించి సంక్షిప్త పరిచయాన్ని విడుడల చేసేందుకు సిద్ధమయ్యారంటే మార్క్స్‌ చెరెన్క్సీ రచనలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో ఓ భాగం పెట్టుబడిదారీ దశలోకి ప్రవేశించకుండానే తదనంతర దశకు ప్రయాణించగలదన్న అంచనాకు మార్క్స్‌ రావటానికి చెరెన్క్సీ రచనల ప్రభావం ఉందంటారు.

చెరెన్క్సీ మాటల్లో ఓ దేశం తన అభివృద్ధి పథంలో నిర్దిష్ట ఆధునిక దశకు చేరుకున్నప్పుడు పొరుగునున్న మరో వెనకబడిన దేశం అదే దశకు చేరటానికి సదరు దేశం ప్రయాణించిన మార్గంలోనే ప్రయాణించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఆ దశకు చేరటానికి మరో దగ్గరి మార్గాన్ని ఎంచుకోవచ్చు. అభివృద్ధి చెందిన దేశం, వెనకబడిన దేశానికి మధ్య ఏర్పడే బహుళసంబంధాలు ఈ మార్గాన్ని ఏర్పాటు చేస్తాయన్నది చెరెన్క్సీ అంచనాగా ఉండేది. ఈ విషయాన్ని వివరించటానికి అమ్మమ్మ తన పెద్ద మనుమలకు మాంసం బొమికలు ఇచ్చి చిన్న మనుమడికి అందులోని మూలిగను ఇస్తుంది అన్న ఉదాహరణను ప్రస్తావిస్తారు చెరెన్క్సీ. ఈ సందర్భంలోనే మార్క్స్‌ గురించిన ఓ ఆసక్తికరమైన సందర్భాన్ని ముస్టో ఈ రచన ద్వారా మనముందుంచుతారు. అప్పటికే రష్యా భాషలో కమ్యూనిస్టు ప్రణాళిక అనువాదం, పెట్టుబడి గ్రంధం తొలి సంపుటి అనువాదం అందుబాటులోకి వస్తాయి. ఈ నేపథ్యంలోనే రష్యాలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి గురించి దేశంలోని వివిధ విప్లవ బృందాల మధ్య మేధో యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధవంలోని రష్యాలోని ఉదారవాద బూర్జువా మేధావులు కూడా ప్రవేశిస్తారు. నికొలాయ్‌ మిఖాయిలొవిస్కీ అటువంటి ఉదారవాద బూర్జువా మేధాల్లో ఒకరు. రష్యాలోని విప్లవ బృందాలను గేలి చేస్తూ ఆయన ‘‘రష్యాలోని మార్క్స్‌ అనుయాయులు గట్టు మీద కూర్చుని చూస్తూ ఉండాల్సిందే…రష్యాలో మార్క్స్‌ సూత్రాలు ఆచరణరూపం దాల్చాలంటే ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తి సాధనాలను కోల్పోయే వరకూ ఎదురు చూస్తూ ఉండాల్సిందే.’’ అని విమర్శిస్తారు. దీనికి స్పందిస్తూ వీరా జెసూలిక్‌ అనే రష్యా విప్లవకారిణి మార్క్స్‌ రష్యా విముక్తి మార్గం గురించి మార్క్స్‌ ఏమి ఆలోచిస్తున్నారో తెలియచేయాలని లేఖ రాస్తుంది. ఆమె లేఖకు సమాధానంగా మార్క్స్‌ రష్యా పెట్టుబడిదారీ దశకు చేరకుండానే సోషలిస్టు విప్లవాన్ని సాధించే అవకాశం ఉందని చెప్తారు. అయితే ఈ లేఖను ఆయన జెసూలిక్‌కు పోస్టు చేయలేదు. తాజాగా మార్క్స్‌ గురించి సాగుతున్న అధ్యయనాలు ఈ లేఖ వృత్తాంతాన్ని ముందుకు తెచ్చాయని ముస్టో చెప్తారు.
ఈ విధంగా ఇప్పటి వరకూ మార్క్సిస్టు అధ్యయనకారులకు, పరిశోధకులకు, అనుయాయులకు అందుబాటులో లేని అనేక విషయాలను ముస్టో తన తాజా రచన ద్వారా మనముందుకు తెస్తారు. కారల్‌ మార్క్స్‌ వర్ధంతి సందర్భంగా మరుగునడిప విలువైన మార్క్సిస్టు సారస్వతాన్ని పాఠకుల దృష్టికి తేవటానికి విశేష కృషి చేస్తున్న మెగా2 ప్రాజెక్టు నిర్వాహకులకు కృతజ్ఞతలు చెప్పక తప్పదు.

-కొండూరి వీరయ్య

(కారల్ మార్క్స్ వర్ధంతి సందర్బంగా తెలుగడ్డా పాఠకులకు ప్రత్యేకం – ఎడిటర్)

Categories
Past talks

The Contemporary Relevance of Marx’s Theories in the World